వాతావరణం చాలా చల్లగా ఉంది. చూస్తుంటే వర్షం పడేలా ఉంది. ఆ చల్ల గాలిలో మన రుక్మిణీ రాసిన ఆ ముందుమాట చదువుతూ, బస్లో వాళ్ల మేనమామ గారి ఇంటికి బయల్దేరాడు మన కథానాయకుడు శ్యామ్. అలా కిటికీ పక్కన కూర్చుని రుక్మిణీనే తలుచుకుంటూ ప్రయాణాన్ని సాగిస్తున్నాడు. తను రాసిన ఆ మూడు పేజీల ముందుమాటను మళ్లీ మళ్లీ చదువుతున్నాడు. ఎందుకో ఏంటో అర్థం కాకుండా అతనిలో అతనే మురిసిపోతున్నాడు శ్యామ్.
అలా వాళ్ల మేనమామ గారి ఇంటి ముందు నిలబడగానే అక్కడ ఎదురుగా మీనాక్షి ఏడుస్తూ కనిపించింది. మీనాక్షి మన శ్యామ్కి వెళ్ళిపో అని సైగ చేసింది. (చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి.) కానీ శ్యామ్కి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. "సరేలే" అని లోపలికి వెళ్లడానికి ప్రయత్నించాడు మన శ్యామ్. లోపలనుండి వరహాలు చాలా కోపంగా బయటకి వచ్చి శ్యామ్ని గుండెల మీద తన్నాడు....అంతే, శ్యామ్ వెనక్కి పడిపోయాడు. బోరున వర్షం పడటం మొదలైంది.
కింద పడిన వెంటనే శ్యామ్కి అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు. శ్యామ్కి ఏం అర్థం కావట్లేదు. వరహాలు మన శ్యామ్ కాలర్ పట్టుకుని మొఖం మీద గట్టిగా గుద్ది, చెంప మీద గట్టిగా కొట్టి,
"ఏం పాపం చేశా రా నీకు? నెల నెల నీకు ఎంతో కొంత పంపుతుంటే బ్రతికే కుక్కవి!! నీకు నా కూతురు కావాల్సి వచ్చిందా? నా పరువు మొత్తం తీసావ్ కదరా....నడూ!" అని గట్టిగా అరుస్తూ శ్యామ్ని బయటకి లాక్కెళ్లాడు.
శ్యామ్కి పూర్తిగా అర్థం కాక,
"మావయ్య...మీరు అనుకున్నట్టు ఏం లేదు మావయ్య....నా మాట నమ్మండి..." అని అంటున్నాడు శ్యామ్. కానీ ఆ మాట కూడా సరిగా రావట్లేదు పాపం. ఆ వీధిలో అందరూ చూస్తుండగా శ్యామ్ని చాలా బలంగా కొట్టాడు.
వెనుకనుండి ఏం చేయలేక చూస్తూ ఉండిపోయింది మీనాక్షి. ఇంకా శుభలక్ష్మి గారు అయితే "వీడికి తగిన శాస్తి జరిగింది" అని మీనాక్షిని లోపలికి బలవంతంగా లాక్కెళ్లింది. ఇంకా మీనాక్షి కూడా ఏం చేయలేని పరిస్థితి.
"రే...నువ్వు మళ్లీ ఈ ఊళ్ళో కనిపించావో....నా చేతుల్లో కుక్క చావు చస్తావ్!!" అని లోపలికి వెళ్లి తలుపు వేసుకున్నాడు వరహాలు.
శ్యామ్కి పూర్తిగా గాయాలు అయ్యాయి. ఒళ్ళంతా రక్తం, దెబ్బలు, నొప్పి. మెల్లగా ఏదోలా పైకి లేచాడు శ్యామ్. చూస్తే అందరూ శ్యామ్ చుట్టూ నిలబడి చూస్తున్నారు. అందులో ఒక ముసలాడు మీనాక్షి గురించి తప్పుగా మాట్లాడాడు. వెంటనే శ్యామ్ ఆ ముసలాడి గొంతు పట్టుకుని,
"ఏం జరిగిందో తెలీకుండా వాగిన వదిలేయడానికి నువ్వు మా మామవి కాదు....చంపి పాతరేస్తా......" అని పక్కకి తోసేశాడు.
ఆ ముసలాడి కొడుకు కోపంతో శ్యామ్ని కొట్టడానికి వచ్చాడు. శ్యామ్ వాడిని కూడా కొట్టి, అక్కడ ఉన్న జనం అందరికీ ఒక మాట చెప్పాడు:
"కారుకూతలు కూస్తే ఊరుకోడానికి నేను మా నాన్నని కాదు.....కబర్దార్...." అని వేలు చూపించి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
బస్లో కూర్చున్న శ్యామ్ వంక అందరూ చాలా వింతగా చూశారు. ఒళ్ళంతా దెబ్బలు, బురద ఉండడం చూసి ఎవరూ శ్యామ్ దగ్గరకి కూడా వెళ్లలేదు. శ్యామ్ మాత్రం ఆ కిటికీ మీద తల వాల్చి కంటతడి పెట్టుకున్నాడు. ఎందుకంటే, ఒకపక్క అతని ఆశయం పోయింది. సొంత మేనమామే అతని బుక్ పబ్లిష్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? పైగా ఇన్ని సంవత్సరాలు నమ్మిన ఒక్కగానొక్క మేనమామ అలా అనేసరికి మన శ్యామ్ గుండె ముక్కలైంది.
మొదటిసారి శ్యామ్ కంటతడి పెట్టుకున్నాడు. ఒక్కసారిగా కూర్చున్న సీటు నుండి కుప్పకూలాడు....