ఎవరో తెలీదు గానీ శ్యామ్ని అతని ఇంటి దగ్గర కూర్చోబెట్టి, నిజానికి నీళ్లు జల్లి వెళ్లిపోయారు.
శ్యామ్ వాళ్ల ఇంటి దగ్గరకి వెళ్లి చూస్తే అక్కడ గుమ్మం దగ్గర ఒక ఉత్తరం ఉంది. అది తీసుకుని లోపలికి వెళ్లి అతను కుర్చీలో కూర్చున్నాడు, అదే దెబ్బలతో నెమ్మదిగా. ఆ ఉత్తరం తెరిచి చూస్తే అది మీనాక్షి నుండి వచ్చింది. అది శ్యామ్ వరహాలు గారి ఇంటికి బయల్దేరే ముందు వచ్చిన లేఖ. అందులో మీనాక్షి జరిగిన విషయం మా నాన్నకి తప్పుగా అర్థం అయ్యింది, పొరపాటున కూడా మా ఇంటికి రావద్దు అని రాసి ఉంది.
శ్యామ్కి మాటలు లేవు. పక్కనే ఉన్న కిటికీ లోంచి చూస్తే బయట వినాయకుడి చిత్రపటం కనిపించింది...
ఆ దేవుడిని చూస్తూ ఉండిపోయాడు ఆ బాధలో.
అసలు శ్యామ్ అక్కడికి వెళ్లడానికి ముందు ఏం జరిగింది?
శ్యామ్ వరహాలు గారి ఇంటికి వెళ్లడానికి ముందు, వరహాలు మీనాక్షిని నిలదీశాడు.
"ఎన్నాళ్లనుండి సాగుతుంది ఈ భాగవతం? మన వాళ్లు అందరూ వాడిని ఎందుకు దూరం పెట్టమో తెలుసా? వాడి నాన్న ఎలాంటి వాడో తెలుసా? ఊర్లో నా పరువు తీసి నన్ను పూర్తిగా జీవచ్చవం చేసావ్ కదే!" అని గట్టిగట్టిగా కేకలు వేస్తున్నాడు మీనాక్షి వాళ్ల నాన్న వరహాలు.
"పరువు" అనే మాట వినగానే పరుగున వచ్చింది మీనాక్షి వాళ్ల అమ్మ.
"ఏంటి అండి ఏం అయ్యింది?" అనుకుంటూ వచ్చింది శుభలక్ష్మి.
మీనాక్షి భయంతో తల కిందకి దించి ఏడుపు మొదలు పెట్టింది. మీనాక్షి ఏం చేసిందో కూడా తెలుసుకోకుండా మీనాక్షి వాళ్ల అమ్మ తనని పదేపదే గాజులు పగిలేలా కొట్టింది.
"ఏం చేసి చచ్చావే ముదరాష్టపు దానా?" అని.
మీనాక్షికి అసలు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. జరిగింది అంతా చెప్పాడు వరహాలు. అది విన్న మీనాక్షి రెండు సార్లు ఎదురు తిరుగుదాం అని ప్రయత్నించి ఆగిపోయింది. ధైర్యం సరిపోక, జరుగుతుంది అంతా చూసి భయంతో చెవులు మూసుకుంది కామాక్షి (మీనాక్షి చెల్లి).
ఇంట్లో అంతా పెద్ద గొడవ జరిగినా సరే, మీనాక్షి ఒక ఉత్తరం రాసి కిటికీ నుండి ఒక పెద్దాయనకి జరిగింది చెప్పి ఆ ఉత్తరం శ్యామ్కి చేర్చమంది.
జరిగింది అంతా ఆ ఉత్తరంలో చదివిన శ్యామ్, అతను రాసిన పుస్తకం — అదే చాలా కష్టపడి రాశాడు కదా, వాళ్ల మేనమామ వరహాలు పబ్లిష్ చేస్తా అన్న కథల పుస్తకం — ఆ పుస్తకాన్ని తీసి ముందు ఉన్న మూడు పేజీలను చింపేశాడు. అదే మన రుక్మిణీ రాసిన ఆ మూడు పేజీల ముందుమాట. ఉన్న పేజీలను చింపి పక్కన పెట్టాడు.
మనసులో వాళ్ల మేనమామ అన్న మాటలే గుర్తుకొస్తున్నాయి. లేవడానికి అతని శరీరం సహకరించకపోయినా పైకి లేచి, ఆ పుస్తకం పట్టుకుని కిరోసిన్ వేసి అగ్గిపుల్లతో నిప్పు అంటించాడు.
ఆ రగిలిన అగ్ని, పుస్తకంతో పాటు మన శ్యామ్ గుండెని కూడా రగిలించింది. ఆ రగులుతున్న మంటల్లో వాళ్ల మేనమామ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. అతన్ని కుక్కతో పోల్చాడు, దిక్కులేని వాడన్నాడు, చేయని తప్పుకి అందరి ముందు అవమానించాడు....
ఆ క్షణం శ్యామ్కి అతని జీవితంలో ఏదో ఒకటి చేయాలి అని అర్థం అయ్యింది. వృథాగా జీవించడంలో ఆనందం లేదు.
"నేను చచ్చినా పర్లేదు... నా పేరు పది మందికి గుర్తుండిపోవాలి..." అని సంకల్పం తీసుకున్నాడు.
ఆ అగ్నికి ఆహుతి అయిన పుస్తకమే సాక్ష్యం....
శ్యామ్ కథ మారబోతోంది.