నిరాశ, ఓటమి మరియు కోపం ఆవరించి ఉన్న ఆ రాత్రిలో... ఆకలి ఆత్మని మలచుకునే సంఘటనను మరోసారి చూద్దాం. మేడమీద సుశాంత్, రామ్ ఇద్దరూ పడుకుంటారు. కానీ సుశాంత్ మాత్రం నిద్రపోకుండా ఆకాశంలో చందమామని చూస్తూ ఉండిపోతాడు.
"ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది..." అని దీర్ఘంగా ఆలోచిస్తాడు.
రామ్ నిద్రలేచి చూస్తే, సుశాంత్ పడుకోకుండా ఆకాశం వంక చూస్తూ కనిపిస్తాడు.
"ఏంట్రా... ఏం ఆలోచిస్తున్నావు?" అని అడుగుతాడు రామ్.
అప్పుడు సుశాంత్ తన ఆలోచనల్లోంచి బయటకు వచ్చి, "ఆ రోజు అమ్మ డైరీ చదవకపోయి ఉంటే, ఈ రోజుకి ప్రజ్ఞ వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు మాట్లాడేవాళ్ళం. మా నాన్న కొన్న బైక్ మీద వెళ్ళేవాళ్ళం..." అని భారంగా అంటాడు.
"ఇప్పుడేమైంది అని? అసలు ఆ డైరీలో ఏముంది రా అంతలా?" అని రామ్ ఆశ్చర్యంగా అడుగుతాడు.
అప్పుడు సుశాంత్ గతంలోకి వెళ్తాడు...
"ఇంటర్వ్యూ ఇచ్చిన రోజు రాత్రి ఇంటికి వెళ్లాను. అమ్మ డైరీని నాన్న పడుకున్నప్పుడు ఓపెన్ చేసి వదిలేశారు. అది పక్కన పెడదామని వెళ్లాను... కానీ, ఎందుకో అమ్మ డైరీ కదా... ఒకసారి చదవాలనిపించింది."
అలా ఆ డైరీలోని కొన్ని సంఘటనలు చదవడం మొదలుపెడతాడు సుశాంత్. అందులో తాను కడుపులో ఉన్నప్పుడు తన అమ్మ జానకి రాసిన పేజీలు చదివి ఎంతో ఆనందిస్తాడు. తాను కడుపులో ఉన్నప్పుడు జానకి భగవద్గీత చదివేదని, ఆ సమయంలో జైరామ్ ఆమెను ఎంత అల్లారుముద్దుగా చూసుకునేవాడో కూడా అందులో ఉంటుంది. ఇలా ఎంతో సంతోషంగా డైరీ చదువుతున్న సుశాంత్ను... ఒక పేరాగ్రాఫ్ ఒక్కసారిగా కుదిపేస్తుంది.
అందులో ఇలా రాసి ఉంది:
"6-12-1998. చాలా ప్రయత్నించాను. పెళ్లయిన తర్వాత కూడా నా మీద నమ్మకంతో, నేను మ్యూజిక్ నేర్చుకోవడానికి మా ఆయన (జై రామ్) ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం. కానీ ఈ రోజు సత్యనారాయణ గారు (మ్యూజిక్ టీచర్) నన్ను అందరి ముందు అవమానించారు. 'నేను పాడడానికి పనికిరాను' అని ఎంతో కఠినంగా మాట్లాడారు. పైగా, తెలియని విషయం ఏంటంటే... 'యామిని' అనే ఆమెకి నా స్థానంలో అవకాశం ఇచ్చారు. నా స్నేహితురాలు అని ఎంతో బాధ పడ్డాను. కానీ ఏం చేస్తాం, మా దగ్గర అంత డబ్బు లేదు. ఆయనకి (జై రామ్కి) చెప్పానంటే అప్పు చేస్తారు, కానీ అది నాకు ఇష్టం లేదు. ఏదోలా మనసు చంపుకుని సంగీతం అంటే ఇష్టం లేదని, ఇక నా వల్ల కాదని చెప్పాలి... ఇప్పటికే ఆయన నాకోసం చాలా అప్పులు చేశారు. కార్ కూడా అమ్మేస్తానంటున్నారు..."
అని రాసి, జానకి మహావిష్ణువు ఫోటో వైపు చూస్తూ, "స్వామీ... కనీసం నా కొడుకు ద్వారా అయినా నా కల నెరవేర్చుకుంటా," అని మొక్కుకున్నట్టు ఉంది.
ఇది చదివిన సుశాంత్, బాధతో కంటతడి పెట్టుకుంటాడు. మరోవైపు, జాబ్ వస్తే ప్రజ్ఞతో పెళ్లి, మంచి సెటిల్డ్ లైఫ్... కానీ సుశాంత్ మాత్రం ఏమీ ఆలోచించకుండా, తన తల్లి కలను నెరవేర్చాలని నిర్ణయించుకుంటాడు. ప్రజ్ఞ కోసం కనీసం ఆలోచించడు.
భావోద్వేగంతో దేవుడి గదిలోకి వెళ్లి, మహావిష్ణువు ఫోటో ముందు నిలబడి... "మా అమ్మ నీ దగ్గరే ఉంది కదా స్వామీ... మా అమ్మకి చెప్పు... నేను సింగర్ అవుతాను! కచ్చితంగా, ఎంత కష్టం వచ్చినా సరే... అమ్మ కల నేను నెరవేరుస్తా," అని గట్టిగా ప్రతిజ్ఞ చేస్తాడు.
గతంలో జరిగిన ఈ విషయాన్నంతా రామ్కి వివరిస్తాడు సుశాంత్.