శ్యామ్ నరసింహం వాళ్ళ ఇంట్లో ఉంటూనే కొత్త పుస్తకం ఒకటి రాస్తున్నాడు, బాల్య వివాహాల గురించి జనానికి అవగాహన కలగడం కోసం. అలా శ్యామ్ పూర్తిగా పుస్తకం రచించడం లో నిమగ్నం అయ్యాడు. అప్పుడే నరసింహం వచ్చి
"కుర్రోడా! ఏంటి ఏదో సీరియస్గా రాసేస్తున్నావ్?" అని అడిగాడు.
నరసింహం ని చూసిన శ్యామ్ గౌరవంగా నిలబడి
"అలాంటిది ఏం లేదు సార్, ఏదో రాయాలి అని అనిపించి రాస్తున్నా అంతే! ఇలా కూర్చోండి" అని అన్నాడు శ్యామ్ మర్యాదపూర్వకంగా.
నరసింహం :-
"ఏమిటోయ్! నా ఇంట్లో నాకే మర్యాదలు చేస్తున్నావ్? సరేలే... మా బావ గారు ఒకరు ఉన్నారు. నీ గురించి చెప్పా. ఆయన ఒక పుస్తకం రాసి అతనే స్వయంగా పబ్లిష్ చేశాడు. నీ గురించి చెప్పగానే వెంటనే నిన్ను అక్కడికి వచ్చేయమన్నాడు" అని చెప్పాడు నరసింహం.
ఆ మాటలు విన్న శ్యామ్ కంట్లో నుండి నీళ్లు తిరిగాయి.
"నా అనుకున్న వాళ్లే సహాయం చేయని ఈ రోజుల్లో నన్ను ఎక్కడో రోడ్డుమీద చూసి ఇంట్లో పెట్టుకుని, నాకోసం ఇంత చేస్తున్నా మీకు ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు సార్" అని నరసింహం గారికి నమస్కరించాడు.
అప్పుడు మండోదరి అక్కడికి వచ్చి,
"అయ్యో! నీలో ఆ పట్టుదల ఉంది బాబు. చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు నువ్వు గొప్పవాడివి అవుతావ్! అందరికీ ఆదర్శంగా నిలుస్తావ్. ఈ తల్లి ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది" అని ఇద్దరూ కలిసి శ్యామ్ ని ఆశీర్వదించారు.
శ్యామ్ వాళ్ళ ఆశీస్సులతో అక్కడి నుండి బయల్దేరాడు.
విశ్వనాథ్ గారి ఊరు వచ్చింది. అక్కడ బస్ దిగిన శ్యామ్ లోపలికి నడుస్తుండగా అక్కడ ముగ్గురు చిన్నపిల్లలు వాళ్ళ వెనుక ఒక తాటి చెట్టు ఆకు కట్టుకుని, కాళ్లకి చెప్పులు లేకుండా మండుతున్న ఎండలో నడుస్తున్నారు పాపం. అది చూసిన శ్యామ్ వాళ్ళని పక్కనే ఉన్న చెట్టు నీడలోకి రమ్మన్నాడు. కానీ వాళ్లు భయంతో ముందుకి వెళ్తున్నారు.
ఆ ముగ్గురిలో ఒకడు ఏడేళ్ల వయసు ఉన్న పెద్దోడు, ఒక ఐదేళ్ల పాప, అలాగే ఇంకో ఆరేళ్ల పిల్లోడు ఉన్నారు. అందులో పెద్దోడి చేయి పట్టుకుని ఆపి
"రే! ఆగమంటే ఆగవు ఏంట్రా? పెద్దోళ్లు అంటే మర్యాద లేదా?" అని అడిగాడు శ్యామ్.
అప్పుడు ఆ కుర్రాడి చేతికి ఉన్న గాయం చూసాడు.
"రే చిన్నా! అసలు ఏం అయ్యింది? ఎందుకు ఇలా తాటి ఆకులు కట్టుకున్నారు మీరు?" అని అడిగాడు.
వాళ్లకి ఉన్న ఆ తాటి ఆకులని తీయబోయాడు. అప్పుడు ఆ కుర్రోడు
"వద్దు అన్నా... మీరు మమ్మల్ని ముట్టుకున్నారు అని తెలిస్తే మీకే ప్రమాదం. మేము అంటరానివాళ్లం! మేము నడిచే దారిలో మీరు నడవకూడదు" అని అన్నాడు.
ఆ మాటలు విన్న శ్యామ్ కి కోపం వచ్చి
"అలా అని ఎవరు చెప్పారు?" అని అడిగాడు.
దూరంగా ఉన్న ఆ ఊరి సర్పంచ్ ని చూపించి,
"అదిగో అన్నా ఆయనే! మా అమ్మని కూడా కొట్టారు కర్రలతో. ఇక్కడ! ఇక్కడ! రక్తం కూడా వచ్చింది" అని ఆ ఐదేళ్ల పాప చెప్పింది.
అది అంత చూసిన శ్యామ్ కి అది కుల సమస్య అని అర్థం అయ్యింది. వాళ్లు తక్కువ జాతి వాళ్లు అని అలా చేస్తున్నారు.
వాళ్ల ముగ్గురికి కట్టిన ఆ తాటి ఆకుల కాడను విరిచి ఒకటే చేసి, ఏకంగా ఆ ఊరిలో దిగగానే అక్కడ ఉన్న సర్పంచ్ నే కొట్టాడు. అసలు శ్యామ్ కి అంత తెగింపు గతంలో ఉండేది కాదు. బహుశా ఆ రోజు కార్ లో హరిచంద్ర అన్న మాటలు గుర్తుకొచ్చాయేమో.
అందరూ శ్యామ్ ని పట్టుకున్నారు. కానీ శ్యామ్ ఆవేశం మాత్రం ఆగడం లేదు. సర్పంచ్ ని కొట్టిన తర్వాత ఆయన స్పృహ కోల్పోయాడు. అయినా సరే అతన్ని స్పృహలోకి వచ్చేలా లేపి, ఎదురు వచ్చిన సర్పంచ్ గారి మనుషుల్ని కూడా కొట్టాడు.
సర్పంచ్ ని కొట్టడంతో పాటు అతనికి వెనుక భాగంలో తాటి ఆకులని కట్టి, చొక్కా చింపి, కాలికి చెప్పులు లేకుండా రోడ్డుమీద బలవంతంగా నడిపించాడు. అంతా చూస్తున్న ఊరి జనం ముందుకి రాలేకపోయారు. ఎందుకంటే శ్యామ్ చేతిలో తుపాకీ ఉంది. నరసింహం ఇచ్చాడు. మన శ్యామ్ దూకుడు తెలిసిందే కదా ఆయనకి.
ఆఖరికి అతన్ని ఒక చెట్టుకి కట్టేసి అలా చాలా సేపు వదిలేశాడు ఆ ఎండలో.
"ఎలా ఉంది? కాళ్లు మండుతున్నాయా? ఎండకి దాహంగా ఉంది కదా? మరి వాళ్లని ఎన్నో సంవత్సరాలుగా అలా చూస్తున్నారు? ఎవడికి గొప్ప రా నీ కులం?" అని అన్నాడు.
అక్కడికి ఆ ఊరి జనం అంతా గుమిగూడారు. అంటరాని వాళ్లు అందరూ వచ్చి
"బాబు వద్దు బాబు! మాదే తప్పు. అయ్యా మమ్మల్ని క్షమించండి, తప్పు అయ్యింది. ఇతనికి మాకు ఎలాంటి సంబంధం లేదు" అని ఊరి జనానికి మొక్కారు.
కానీ వెనుక ఊరి జనం మాత్రం ఏం మాట్లాడలేకపోయారు. ఎందుకంటే వెనుక శ్యామ్ చేతిలో తుపాకీని చూసి.
ఆ మాటలు అన్న ఆ అంటరాని వ్యక్తికి ఏం అర్థం కాలేదు. ఎందుకు ఎవరు ముందుకి రావడం లేదో, అక్కడ ఒక్క శ్యామ్ కి అంతా మంది ఎందుకు భయపడుతున్నారో! వెనక్కి తిరిగి చూస్తే శ్యామ్ చేతికి సర్పంచ్ గారి రక్తం. ఇంకొంచెం అరచేతిలో చూస్తే శ్యామ్ చేతిలో ఉన్న తుపాకీ.
"నేను ఈ ఊరులో ఉన్నా లేకపోయినా, ఎవడైనా కులం, మతం, ప్రాంతం, వర్గం అని వ్యత్యాసం చూపించారో... ఒకటే తూటా. ప్రాణం, కులం రెండూ ఒకేసారి పోతాయి" అని గట్టిగా అందరికీ వార్నింగ్ ఇచ్చాడు.
"ఎవరి పనుల్లోకి వాళ్లు వెళ్ళండి... పొండి!" అని తూటా పేల్చాడు. అందరూ అక్కడి నుండి ఆ శబ్దానికి పరుగులు తీశారు.
కానీ అందులో నుండి ఒక్కడు మాత్రం కదలలేదు. ఎవరా అని శ్యామ్ చూస్తున్నాడు. చూస్తే అక్కడ ఉంది విశ్వనాథ్ గారు. శ్యామ్ కి ఆయనని గుర్తించడానికి ఎంతో సమయం పట్టలేదు.
పక్కన ఉన్న అంటరాని వ్యక్తులు మన శ్యామ్ ని దేవుడిని చేశారు. అందులో ఒక్క ముసలావిడ శ్యామ్ కి దండం పెట్టి
"బాబు! నేను బ్రతికి ఉండగా ఇలాంటి ఈరోజుని చూస్తానని అనుకోలేదు బాబు. రేపో మాపో నా వల్ల ఉపయోగం లేదు అని ఈ వయసులో ఈ అవస్థలు పడలేను అని నా కొడుకే నన్ను చంపాలి అని చూసాడు. నువ్వు ఏ తల్లి బిడ్డవో... ఈ తల్లి ఆశీర్వాదాలు నీకు ఎప్పుడూ ఉంటాయి" అని శ్యామ్ చేయి పట్టుకుంది.