అప్పటి దాకా శ్యామ్ ఏం చేశాడో, ఎందుకు అంత కోపం వచ్చిందో శ్యామ్కే అర్థం కాలేదు. కానీ శ్యామ్ చేసిన పని వల్ల అక్కడ ఉన్న అంటరాని వాళ్లకి ధైర్యం వచ్చింది. శ్యామ్ను వాళ్లు నాయకుడిగా స్వీకరించారు. ఇంకా విశ్వనాథ్ శ్యామ్ దగ్గరకి వెళ్లగానే, శ్యామ్ అతనికి
"నన్ను క్షమించండి సార్, మీ తరుపున మీ ఊరిలోకి వచ్చి మీ పేరు చెడగొట్టా, నేను ఇంకా బయల్దేరాను" అని అన్నాడు.
అప్పుడు విశ్వనాథ్ :-
"ఆగు శ్యామ్! నేను నా చిన్నప్పటి నుండి పోరాడుతున్నా బాబు! ఈ వివాదాల్లో ఉండడం వల్ల ఊరి జనంతో నాకు పెద్దగా సంబంధాలు లేకపోయాయి. నేను కూడా ఇలా చేయలేను ఏమో. వాళ్లని చూసావా? నిన్ను దేవుడు అని అంటున్నారు! నువ్వు నా శిష్యుడివి అవ్వడం కాదు, నేను నీకు శిష్యరికం చేస్తా!" అని శ్యామ్కు చేతులు జోడించాడు.
శ్యామ్ :-
"అయ్యో సార్! ఏంటి ఇది, మీరు నా కన్నా వయసులో పెద్దవారు!" అని అన్నాడు.
కానీ అదే సమయానికి పోలీసులు అక్కడికి వచ్చి శ్యామ్ను అరెస్ట్ చేశారు. అతని దగ్గర ఉన్న తుపాకీని లాక్కొన్నారు. శ్యామ్ను జైలు కి తరలించారు, పోలీస్ కస్టడీలో పెట్టారు, సెల్లో వేశారు.
కానీ బయట జనం మాత్రం వందల్లో గుమిగూడారు. గట్టిగట్టిగా అరుపులు, కేకలతో పోలీస్ స్టేషన్ దద్దరిల్లింది. అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ :-
"ఏంటి అయ్యా ఇంత మంది జనం? పొరపాటున ఏదైనా రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేశారా?" అని అడిగాడు.
దానికి కానిస్టేబుల్ :-
"ఏమో సార్, ఇతను ఎవరో ఏంటో ఇంకా తెలీదు" అని అన్నాడు.
విశ్వనాథ్ నరసింహానికి ఫోన్ చేసి జరుగుతున్నది అంతా చెప్పాడు. కొన్ని గంటల క్రితం వరకు శ్యామ్ ఎవరో తెలియని వాళ్లు అందరూ ఇప్పుడు శ్యామ్ను విడిపించుకోవడానికి వాళ్ల ప్రాణాలనే పణంగా పెడుతున్నారు. పెద్ద చిన్న, ఆడ మగ అని తేడా లేకుండా ఆ జాతి వారు అంతా అక్కడే ఉన్నారు.
"మా నాయకుడిని వదిలే దాకా మేము ఎక్కడికి వెళ్లం" అని జనం ముందుకొస్తున్నారు. పోలీస్ స్టేషన్ మీద రాళ్లు విసిరారు. పోలీసుల చేత దెబ్బలు తిన్నారు. అయినా కూడా పట్టు విడవలేదు.
శ్యామ్కు మాత్రం ఏం అర్థం కావట్లేదు. అసలు ఏం చేశానని వాళ్లు అంతలా శ్యామ్ కోసం చేస్తున్నారో అర్థం కాలేదు. కానీ అది ఆ జాతి వాళ్ల బాధ... ఎన్నో ఏళ్ల నిరీక్షణ, ఎన్నో ఏళ్ల అవమానాలు, చెప్పు దెబ్బలు... అవన్నీ ఇప్పుడు రగిలే నిప్పు ఖనిజాలు అయ్యాయి. వాళ్లలో విప్లవం అనే అగ్నిని ఒక గంటలో రగిలించాడు శ్యామ్. వాళ్లకి ఇదే సరైన సమయం — ఎదురు తిరిగి సమాజంలో వాళ్లకంటూ ఒక గుర్తింపు ఏర్పరుచుకోవడానికి.
అందరూ శ్యామ్ను దేవుడిని చేశారు. వాళ్ల నాయకుడిగా భావించారు. ఆ వార్త దేశం మొత్తం హల్చల్ చేసింది. అక్కడ ఉన్న అన్ని వార్తాపత్రికల్లో శ్యామ్ ప్రస్తావనే వినిపిస్తుంది.
దేశం మొత్తం తెలిసిన వార్త మన వరహాలకి తెలీకుండా ఉంటుందా! ఊరి జనం అంతా శ్యామ్ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆ వార్త రేడియోలో విన్న మీనాక్షి దేవుడికి దండం పెట్టుకుని
"గోవిందా, మా బావకి ఏం కాకుండా ఉండేలా చూడు స్వామి" అని కోరుకుంది.
శుభలక్ష్మికి అది నచ్చలేదు. చేతిలో ఉన్న బియ్యం పళ్లెం నేలకేసి కొట్టి లోపలికి వెళ్లింది. అప్పుడు మీనాక్షికి కోపం వచ్చి
"అసలు బావ అంటే ఎందుకు అమ్మ అంత కోపం? ఆ రోజు నేనే బావ చేతులు పట్టుకున్నా, కనీసం బావ నా మొహం కూడా చూడలేదు. మీరే బావను తప్పుగా అపార్థం చేసుకున్నారు!" అని గట్టిగా అరిచింది వాళ్ల అమ్మ మీద.
వాళ్ల అమ్మ :-
"మీనాక్షి!!!..." అని అరిచింది.
మీనాక్షి :-
"మామయ్య, అత్తయ్య చేసిన పనికి ఊహ తెలియని వయసు నుంచే బావ మీద పగ పెంచుకున్నారు! ఏ తప్పూ చేయని బావ చిన్నప్పుడే అందరినీ కోల్పోయాడు! ఏదోలా బ్రతుకుతున్న బావను అందరి ముందు అవమానించాడు నీ భర్త! అసలు బావను ప్రేమించింది నేను!" అని తెగించి చెప్పింది మీనాక్షి.
ఆ మాటలు అన్నీ విన్న వరహాలు లోపలికి వచ్చి మీనాక్షిని చెంప మీద కొట్టాడు.
"ఆడపిల్లవు నువ్వు, బరితెగించి మాట్లాడుతున్నావ్! సిగ్గులేకపోతే సరి?" అని అన్నాడు.
వెనుకనుండి కామాక్షి వచ్చి
"ఏళ్లు ఎదిగిన కూతురిని కొట్టారు... మరి మీరు చేస్తుంది ఏంటి నాన్న? అక్కకి చిన్నప్పటి నుండి బావ అంటే ఇష్టం. ఆ విషయం మీకు ముందే తెలుసు! బావ అలాంటి వాడు కాదు అని కూడా తెలుసు" అని చెప్పింది.
ఇద్దరు కూతుళ్లు అలా అనేసరికి చేదు వాస్తవంలోకి వచ్చాడు వరహాలు. అక్కడే కుప్పకూలిపోయాడు. ఇప్పుడిప్పుడే ఏం జరిగిందో మొత్తం వరహాలకు మెల్లమెల్లగా అర్థం అవుతుంది... అతను ఎంత తప్పు చేశాడో అని.
వరహాలు గారికి తెలిసింది అంటే ఈ వార్త మన రుక్మిణీ వాళ్లకి కూడా తెలిసింది ఏమో? ఒకవేళ తెలిస్తే, అప్పుడు మన శ్యామ్ ఎక్కడ ఉన్నాడో రుక్మిణీకి అలాగే రఘురాంకి తెలిసినట్టే. అంటే వాళ్లకి శ్యామ్ దొరికినట్టేనా?