శ్యామ్ గురించి వార్త పత్రికలో చూసిన ప్రేమ్, వెంటనే ఆ వార్త పత్రిక పట్టుకుని రఘురాం దగ్గరకి వచ్చి, "రామ్ గారు... మన శ్యామ్ దొరికాడు!" అని గట్టిగా అన్నాడు. అప్పుడు వంటగదిలో ఏవో పనుల్లో ఉన్న రుక్మిణీ, ఆ పనిని మధ్యలోనే వదిలిపెట్టి పరుగులు తీసుకుంటూ రఘురాం మరియు పద్దు వాళ్ల గదిలోకి వెళ్లింది. అప్పుడు రఘురాం, "షూ... నెమ్మదిగా... మామయ్య గారు వింటారు" అని అన్నాడు.
సరే అని ఆ వార్త పత్రిక రఘురాంకి ఇస్తుండగా, ముందుగా రుక్మిణీ గబుక్కున లాక్కుంది, శ్యామ్ని చూద్దాం అనే ఆనందంతో. కానీ ఆ వార్త పత్రిక చదివిన తర్వాత రుక్మిణీ మొహంలో ఆ ఆనందం పోయింది. బదులుగా దిగులు, శ్యామ్కి ఏం అవుతుందో అనే ఆందోళన ఎక్కువయ్యాయి. రుక్మిణీ చేతి నుండి కింద పడ్డ ఆ పత్రికను పద్దు తీసి బయటకు చదివింది. అందరూ ఇప్పుడు ఆందోళనలో పడ్డారు.
"అక్క, ఎలా అయినా మనం శ్యామ్ దగ్గరకి వెళ్లాలి! ఏదో ఒకటి చేయి అక్క, please" అంది రుక్మిణీ ఎంతో కంగారుగా.
అప్పుడు రఘురాం, "నీకు నిశ్చితార్థం కూడా ఖాయం అయ్యింది. ఇప్పుడు నిన్ను ఎక్కడికి పంపిస్తారు? అది అవ్వని పని" అని అన్నాడు.
ఆ మాటలు విన్న రుక్మిణీకి అర్థం అయ్యింది. తను శ్యామ్ దగ్గరకి వెళ్లలేను అని అర్థం అయ్యింది మన రుక్మిణీకి. ఇంకా ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయింది.
అప్పుడు పద్దు, "నా దగ్గర ఒక ఉపాయం ఉంది!" అని అంది.
వెంటనే మిగతా ముగ్గురు — ప్రేమ్, రుక్మిణీ, రఘురాం — పద్దు ఏం చెప్తుందా అని ఆసక్తిగా ఎదురుచూశారు.
పద్దు, "మేము మా ఇంటికి వెళ్తున్నాం నాన్న. రుక్మిణీకి పెళ్లి అయిపోతే ఒక్కర్తే మా ఇంటికి ఇంకా రాలేదు కదా. ఒక మూడు రోజులు నా దగ్గర ఉంటుంది అని నాన్నని కాకా పట్టనే అనుకో, నిన్ను పంపిస్తారు. అప్పుడు మనం అలా శ్యామ్ని కలవచ్చు!!!" అని సలహా ఇచ్చింది.
ఆ మాట విన్న రుక్మిణీ, వాళ్ల అక్కని ఎంతో పట్టరాని ఆనందంతో హత్తుకుంది.
అప్పుడు రఘురాం పక్కనుండి, "అమ్మ యువరాణీలు... మీ తండ్రి వార్యులు ముందు పంపనివ్వండి, ఊరికే గోల చేస్తున్నారు" అని అన్నాడు రఘు.
దెబ్బకి అందరూ వాస్తవంలోకి వచ్చారు. అసలు ఇప్పుడు అలాంటి సలహా ఇచ్చినందుకు మన పద్దు ఇరకాటంలో పడింది పాపం.
"ఆలోచన నాది కాబట్టి మీ బావగారు వెళ్లి అడుగుతారు. ఏం రుక్మిణీ, నేను చెప్పింది బానే ఉంది కదా!" అని అంటుంది.
అప్పుడు రుక్మిణీ, ప్రేమ్, రఘురాం — అందరూ కలిసి మన పద్దు వంక చూస్తూ ఉండిపోయారు.
పద్దు, "అర్థం అయ్యింది, అలా చూడకండి. నేనే వెళ్తా అడగడానికి!" అని భయం భయంగా అంది మొహమాటంతో.
ఇంకా ఎలాగో తప్పదు కదా అని ధైర్యం చేసుకుంది మన పద్దు, హరిచంద్ర దగ్గరకి వెళ్లింది.
హరిచంద్ర కాఫీ తాగుతున్నాడు చక్కగా రేడియోలో పాటలు వింటూ. హరిచంద్ర వైఖరి చూస్తుంటే, అతను తుఫాన్ ముందు వచ్చే నిశ్శబ్దంలా చాలా ప్రశాంతంగా ఉన్నాడు.
పద్దు భయం భయంగా, "నాన్న గారు... మీతో ఒక విషయం మాట్లాడాలి!" అని అంది.
అప్పుడు హరిచంద్ర కొంచెం కోపంగా, "ఏంటో త్వరగా చెప్పు" అని అన్నాడు.
అప్పుడు పద్దు భయంతో వెనక్కి వచ్చేద్దాం అనుకుంది. కానీ పక్కకి తిరిగి చూస్తే, కిటికీ బయట ముగ్గురు పద్దుని అడగమని బెదిరిస్తున్నారు. రుక్మిణీ మాత్రం బ్రతిమాలుతుంది. ఎందుకంటే శ్యామ్ పరిస్థితి అక్కడ ఎలా ఉందో ఏంటో అనే ఆందోళన మన రుక్మిణీకి.
అప్పుడే పక్కనుండి సుమతీ వచ్చి,
సుమతీ, "అమ్మ పద్దు, ఎలాగో మీరు రేపు వెళ్లిపోతున్నారు. మళ్లీ దాని నిశ్చితార్థానికి వస్తారు కదా. సరదాగా చెల్లిని కూడా మీ ఇంటికి తీసుకువెళ్లి ఒక ఐదు రోజులు ఉంచండి. అలా రుక్మిణీనే మీ తరఫున వాళ్లకి, బావగారి తరఫున వాళ్లకి పిలుపు పంపండి" అని అంది సుమతీ.
ఆ మాటలు విన్న పద్దుకి ఎంతో ఉపశమనం కలిగింది.
వెనుకనుండి అది అంత చూస్తున్న ప్రేమ్, పక్కనే ఉన్న ఖాళీ బిందెలని తన్నేశాడు ఆ ఆనందంలో. అందరూ, రఘురాం ప్రేమ్ని వెంటనే పక్కకి లాగేశాడు.
ఆ శబ్దం ఏంటి అని చూసాడు హరిచంద్ర. అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ ఎవరూ లేరు. వెనక్కి వచ్చి,
"సరే, రేపు మంగళవారం. ఈరోజు సాయంత్రం బయలుదేరమను అల్లుడిగారితో. మన కార్లో దింపెట్టమను" అని అన్నాడు హరిచంద్ర.
పద్దు ఆనందంగా అక్కడ నుండి వెళ్లింది. పద్మిని, రఘురాం లతో పాటు మన రుక్మిణీ కూడా బట్టలు సర్దుకుంది గబగబా.
ఇంకాసేపటిలో శ్యామ్ని చూస్తాననే ఆనందం కన్నా, శ్యామ్ని జైల్లో చూడాల్సి వస్తుంది అనే బాధే ఎక్కువ ఉంది మన రుక్మిణీకి.