శ్యామ్ మరియు నరసింహం గారు విశ్వనాథ్ గారి ఇంటికి వెళ్లారు. విశ్వనాథ్ గారు మన శ్యామ్ రాసిన పుస్తకాన్ని చూశారు. అందులో శ్యామ్ రాసిన ప్రతి విషయం కూడా సమాజంలో ఎన్నో మార్పులకు కారణం కానుందని విశ్వనాథ్ నమ్మి,
"ఈ పుస్తకాన్ని నేను పబ్లిష్ చేయిస్తా శ్యామ్! కానీ ఒకటి మాత్రం నీకు చెప్పాలి. నీలో ఉన్న ఈ అగ్ని ఇలానే రగిలించు. నువ్వు తర్వాత ఎన్ని పుస్తకాలు రాస్తావో నాకు తెలీదు, కానీ మనిషి గొప్పతనం అతనికి అన్నీ ఉన్నప్పుడు ఎలా ఉంటాడో అప్పుడే తెలుస్తుంది. నీ స్థితప్రజ్ఞతని చాటు" అని ఒక గురువులా శ్యామ్కి కొన్ని మంచిమాటలు ఉపదేశించాడు.
శ్యామ్ ఆ మాటలు జాగ్రత్తగా విని సరే అన్నాడు.
అప్పుడే ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. విశ్వనాథ్ గారు తలుపు తీద్దాం అని వెళ్తే, శ్యామ్ :-
"మీరు కూర్చోండి, నేను వెళ్లి చూస్తా" అని అన్నాడు.
తలుపు తెరిచి చూస్తే అక్కడ రుక్మిణీ ఉంది. ఒక్క క్షణం అది నిజమో అబద్ధమో శ్యామ్కి ఏం అర్థం కాలేదు. శ్యామ్ని అలా చూసిన రుక్మిణీ వెంటనే గట్టిగా కౌగలించుకుంది. రుక్మిణీకి ఎన్నో భావాలు నోటి నుండి బయటకు రాకపోయే సరికి, శ్యామ్ క్షేమంగా ఉన్నాడు అని ఏం మాట్లాడాలో తెలియక, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కౌగలించుకుంది.
కానీ శ్యామ్ చేతులు మాత్రం రుక్మిణీని కౌగలించుకోలేదు.
శ్యామ్ :-
"ఏవండీ ఏంటి ఏం...!" అని మాట పూర్తి చేయకముందే,
రుక్మిణీ :-
"ఏం మాట్లాడకు కాసేపు!" అని అంది.
శ్యామ్ ఎదురుగా చూస్తే అక్కడ ప్రేమ్ ఉన్నాడు. వాళ్లతో పాటే రఘురాం మరియు పద్దులు కూడా ఉన్నారు. వాళ్లు అంతా రుక్మిణీ, శ్యామ్ల కలయిక కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూశారు ఇన్ని రోజులు. కాబట్టి అందరి ముఖాల్లో ఆ ఆనందం, చిరునవ్వు, ఉత్సాహం కనిపించాయి. అంతా మధురంగా ఉంది వాళ్ల కలయిక.
శ్యామ్ :-
"రుక్మిణీ గారు... అందరూ చూస్తున్నారు!" అని అన్నాడు.
అప్పుడు రుక్మిణీ శ్యామ్ని వదిలి వాళ్ల బావ, అక్కలను పరిచయం చేసింది. రఘురాం వాళ్లు వచ్చి శ్యామ్తో పరిచయం చేసుకున్నారు.
రఘురాం :-
"శ్యామ్ గారు, ఇక్కడ మేము ఉండొచ్చా? అంటే... మీకు ఇబ్బంది అవ్వకూడదు అని" అని సందేహంగా అడిగాడు.
అప్పుడు విశ్వనాథ్ :-
"బాబు, నా ఆతిథ్యం స్వీకరించండి. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. పైగా మా శ్యామ్కి కావాల్సిన వాళ్లు అంటున్నారు. లోపలికి రండి" అని అన్నాడు.
అప్పుడు నరసింహం :-
"నిజానికి విశ్వనాథ్ గారి భార్య లేదు. ఆవిడ చనిపోయిన తర్వాత అందరూ రెండో పెళ్లి చేసుకోమని ఆయనకి ఎందరో సలహా ఇచ్చినా, ఆయన ఒక్కడిగానే మిగిలిపోయారు. అది మా బావ అంటే!" అని విశ్వనాథ్ గారి గొప్పతనం చాటాడు నరసింహం.
అది విన్న ప్రేమ్ :-
"అంటే వంట ఎవరు వండుతారు?" అని అన్నాడు.
అందరూ ప్రేమ్ వైపు కోపంగా చూశారు.
ప్రేమ్ :-
"అంటే వంట చేసేవాళ్లు ఎవరని నా ఉద్దేశం!" అని తడబడుతూ అన్నాడు.
అప్పుడు పద్దు :-
"నేను ఉన్నా కదా గురువుగారు, నేను చేస్తా. ఏవండీ నేను చెప్పిన సామాన్లు తీసుకురండి" అని అంది.
పద్దు చురుకుతనం చూసి మురిసిపోయాడు విశ్వనాథ్.
రుక్మిణీ శ్యామ్ని పిలిచి,
రుక్మిణీ :-
"మీతో కొంచెం మాట్లాడాలి!" అని అడిగింది.
అప్పుడు శ్యామ్ సరే అని, అలా ఇద్దరూ కలిసి ఆ ఊరిలో ఉన్న పెద్ద చెరువు దగ్గరకి వెళ్లారు.
ఆ సాయంత్రం రుక్మిణీ శ్యామ్ పక్కనే కూర్చుంది.
శ్యామ్ :-
"చెప్పండి, ఏదో మాట్లాడాలి అన్నారు?" అని అడిగాడు.
రుక్మిణీ :-
"మా నాన్న గారి వాళ్ల మీకు ఇబ్బంది కలిగించి ఉంటే నన్ను క్షమించండి" అని అంది.
అప్పుడు శ్యామ్ :-
"అవన్నీ పట్టించుకునే వాడిని అయితే జీవితం లో ఇంతవరకు రాలేను రుక్మిణీ గారు. అయినా ఆ విషయాలు అన్నీ పక్కన పెట్టండి" అని అన్నాడు.
రుక్మిణీ శ్యామ్ భుజం మీద తల వాల్చి,
"నేను ఇక్కడ ఇంకో మూడు రోజులు ఉంటా. ఆ తర్వాత..." అని తడబడుతుంటే,
శ్యామ్ :-
"ఆ తర్వాత మీ నాన్న గారితో మాట్లాడాలి. పెళ్లి చేసుకుందాం" అని అన్నాడు.
ఆ మాట విన్న రుక్మిణీ, శ్యామ్ చేతిలో చేయి వేసి సిగ్గుపడుతూ తల దించుకుని, కాస్త ఓరకంటితో శ్యామ్ని చూస్తూ :-
"నా మనసులో మాటే చెప్పారు!" అని అంది.
ఆ సాయంత్రం సూర్యాస్తమయం చూసి,
శ్యామ్ :-
"ఏదో పుస్తకం రాస్తాను అన్నారు తమరు? మర్చిపోయారా?" అని అన్నాడు.
అప్పుడు రుక్మిణీ :-
"సమయం వచ్చినప్పుడు అన్నీ వస్తాయి శ్యామ్ గారు... అంత తొందర ఎందుకు?" అని సిగ్గుపడుతూ అంది.
అప్పుడు శ్యామ్ :-
"అలాగే అండి, మీకు నచ్చినంత సమయం తీసుకోండి!" అని పైకి లేచాడు.
శ్యామ్ :-
"చీకటి అవుతుంది, పదండి వెళ్దాం!" అని అన్నాడు.
శ్యామ్ చేయి పట్టుకుని ఆపింది రుక్మిణీ :-
"చీకటి పడ్డాక నీతో నక్షత్రాలు చూడాలి అని ఉంది!" అని అంది.
అప్పుడు శ్యామ్ సరే అని చలిమంట సిద్ధం చేశాడు. చెరువు పక్కన కావడంతో చీకటి పడ్డ తర్వాత వీచే చల్లగాలులు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. అందులో ఆ నిండు పున్నమి వెన్నెలలో పక్కపక్కనే కూర్చుని ఏమి మాట్లాడకుండా పూర్తి నిశ్శబ్దాన్ని అనుభూతి చెందుతున్నారు.
ఇప్పటి వరకు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న వాళ్లు ఇప్పుడు ఒకరి కోసం ఒకరు తోడయ్యారు. ఒకరితో ఒకరు ఉన్నప్పుడు ప్రపంచాన్నే మరిచారు. అసలు ఏం జరగనట్టే ఇద్దరూ ప్రేమలోకంలో మునిగి తేలారు.
శ్యామ్ రుక్మిణీకి ధ్రువ నక్షత్రం చూపించాడు. ఆ నక్షత్రం యొక్క ప్రత్యేకత కూడా తెలిపాడు. అది అంతా విన్న రుక్మిణీ :-
"అబ్బో రైటర్ గారికి చాలా విషయాలు తెలుసు అన్నమాట!... ఇంకా ఏం ఏం తెలుసు?" అని శ్యామ్ భుజంపై తల వాల్చి అడిగింది.
అప్పుడు శ్యామ్ కొద్దిగా పక్కకి జరిగి రుక్మిణీ ఒడిలో పడుకుని,
"చిన్నప్పుడు ఎప్పుడో ఇలానే మా అమ్మ ఒడిలో పడుకున్నా. అప్పుడు మా అమ్మ కూడా ఇలానే నాకు చందమామ కథలు చెప్పేది. కానీ ఏం అయ్యిందో ఏంటో... మా నాన్న చేసిన కొన్ని..." అని మాట పూర్తి చేయకముందే శ్యామ్ కంటినుండి కన్నీరు వచ్చేసింది.
రుక్మిణీ శ్యామ్ నుదిటిపై చేయి పెట్టి నిమిరి,
"మగాళ్లు ఏడిస్తే బాగోదు శ్యామ్ గారు, మీరు అసలు బాగోలేదు! అయినా ఇప్పుడు ఏం తక్కువ అని మీకు? ఎక్కువ ఆలోచించకుండా కాసేపు ఇలానే నా ఒడిలో పడుకోండి" అని అంది రుక్మిణీ.
ఆ మాట తర్వాత శ్యామ్ రుక్మిణీని అలా చూస్తూ నిద్రపోయాడు. అలా ఆ రాత్రి వాళ్లకి మాత్రమే అన్నట్టుగా అక్కడే గడిచిపోయింది. ఇంటికి వెళ్లడం కూడా మర్చిపోయారు.
శ్యామ్ నిద్రలో ఉండగా రుక్మిణీ శ్యామ్ ముఖాన్ని ఆ పున్నమి వెలుగులో అలా చూస్తూ ఉండిపోయింది. ఎంత బాగున్నాడో అని చేతులతో దృష్టి తీసి తన కాటుక తీసి బుగ్గ మీద చుక్క పెట్టింది శ్యామ్కి. ఎందుకంటే శ్యామ్ మెలకువలో ఉన్నప్పుడు అలా అంతసేపు చూసే ధైర్యం మన రుక్మిణీకి లేదు. ఇంకా ఎవరు లేరు కాబట్టి, శ్యామ్ని తనివితీరా చూసుకుందాం అని అనుకుంది పాపం.
మరోవైపు ప్రేమ్ మరియు రఘురాం లు రుక్మిణీ, శ్యామ్ల కోసం వెతుకుతూ ఆ చెరువు దగ్గరకి వచ్చారు. అక్కడ వాళ్లిద్దరినీ చూసి,
ప్రేమ్ :-
"వీళ్లని ఇలాగే వదిలేస్తే ఇక్కడే కాపురం పెట్టేసేలున్నారు! పద లేపుదాం" అని అన్నాడు.
ప్రేమ్, రఘురాం లు దగ్గరకి వెళ్లడం చూసిన రుక్మిణీ :-
"శ్యామ్ పడుకున్నాడు... మేము తర్వాత వస్తాం, మీరు వెళ్లండి" అని సైగ చేసింది.
కానీ మన ప్రేమ్కి అర్థం కాక :-
"ఏంటి? వినబడడం లేదు! గట్టిగా చెప్పు " అని అరిచాడు , ఆ మాటల కి శ్యామ్ లేచాడు , " రామచంద్ర ప్రభు...." అని తల కొట్టుకుంది రుక్మిణీ, పాపం శ్యామ్ నీ అలా ఇంకేసేపు చూడాలి అని ఇండి ఆమెకి , ప్రేమ్ :- " సారి సిస్టర్ ఫుడ్ ఈటింగ్ , యూ కమింగ్ ...ఏం అనుకోకు నాకు ఆంగ్లం రాదు "
అని తల గోకుంటూ అన్నాడు ,అప్పుడే ప్రేమ్ శ్యామ్ మొకం మీద ఉన్న ఆ నల్ల కాటుక మచ్చ నీ చూసి కడుపు ఉబ్బే లా నవ్వుకున్నాడు, శ్యామ్ కి ప్రేమ్ ఎందుకు నవ్వుతున్నాడు అని అర్థం కాలేదు, రుక్మిణీ ఇబ్బందికరమైన చిరునవ్వు నవ్వి , శ్యామ్ బుగ్గ మీద తన కొంగుతో తుడిచింది.
శ్యామ్ రుక్మిణీ లు కలిసి వాళ్ళు ఇప్పుడు ఉంటున్న ఇంటికి వెళ్ళారు , అందరూ కలిసి భోజనాలకి కూర్చున్నారు.