శ్యామ్, రుక్మిణీలు కలిసి వాళ్లు ఇప్పుడు ఉంటున్న ఇంటికి వెళ్లారు. అందరూ కలిసి భోజనాలకు కూర్చున్నారు.
అప్పటికే విశ్వనాథ్ గారు భోజనం చేశారు, కానీ రుక్మిణీ, శ్యామ్ల కోసం ఎదురు చూస్తున్నారు.
"ఏంటి బాబు, చీకటి పడేలోపు వచ్చేయాలి కదా! అసలే ఆ సర్పంచ్ మనుషులు నీ మీద కక్ష కట్టి ఉన్నారు" అని అన్నాడు విశ్వనాథ్.
అప్పుడు శ్యామ్ తల దించుకున్నాడు.
విశ్వనాథ్ :-
"సరేలే, భోజనం చేసి పడుకోండి. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది" అని అన్నాడు.
అప్పుడు పద్దు వచ్చి వాళ్లని కింద కూర్చోమంది. ప్రేమ్ శ్యామ్ పక్కన కూర్చుందాం అని కంచం పెట్టుకున్నాడు. చేతులు కడుక్కోవాలి అని పైకి లేచాడు పాపం. అదే సరైన సమయం అని ఆ చోటులో రుక్మిణీ వెళ్లి కూర్చుంది.
ప్రేమ్ :-
"పిచ్చి పలురకాలు అంటే ఏంటో అనుకున్నా... ఏంటో వీళ్లని చూసి ఆనందపడాలో, అసూయ పడాలో అర్థం కావట్లేదు" అని ఇంకో కంచం తెచ్చుకుని రఘురాం పక్కన కూర్చున్నాడు.
అందరూ భోజనం చేస్తుండగా, రఘురాం :-
"తమ్ముడు! అసలు మా రుక్మిణీ ఎవరితో పెద్దగా మాట్లాడదు కదా, మరి మీలో ఎవరు ముందు మీ ప్రేమ వ్యక్తం చేశారు?" అని అడిగాడు.
అప్పుడు శ్యామ్, రుక్మిణీలు చాలా సేపు ఆలోచించారు. ఇద్దరూ ఏం మాట్లాడలేదు. వాళ్ల మౌనం చూసిన పద్దు :-
"చెప్పు! ఎవరు ముందు ప్రపోజ్ చేశారు? శ్యామ్ ఏ కదా?" అని అడిగింది.
అప్పుడు పక్కనుండి ప్రేమ్ :-
"మావాడు అమ్మాయిని చూస్తే ఆమడ దూరం పరిగెడతాడు. వాడు ప్రపోజ్ చేసే అవకాశం లేదు!" అని అన్నాడు.
అప్పుడు రఘురాం :-
"ఏంటి మరదలా! నువ్వునా?" అని ఆటపట్టిస్తూ అడిగాడు.
వాళ్లు మాత్రం అలా నిశ్శబ్దంగా ఉండి ఒకరిని ఒకరు చూసుకుని సిగ్గుపడుతున్నారు. ఎందుకు అంటే వాళ్లు అసలు ఎప్పుడూ ఒకరిని ఒకరు ప్రేమిస్తున్నట్టు ఎవరికి చెప్పలేదు. కనీసం ప్రేమ అన్న మాట కూడా వాళ్ల నోటి నుండి రాలేదు. కానీ రుక్మిణీ వెనక్కి తిరిగి వచ్చేసరికి వాళ్ల మనసులకు ఎందుకో తెలిసిపోయింది... ఒకరికి ఒకరు అని. అదే స్వచ్ఛమైన ప్రేమ అని కూడా అర్థం అయ్యింది. వాళ్లిద్దరి సిగ్గులో దాగి ఉన్న అర్థం ఇదే! ఎందుకు అంటే వాళ్లు పెద్దగా మాట్లాడుకోకపోయినా వాళ్ల ప్రేమ ఒకరి హృదయం నుండి ఒకరికి తెలియజేస్తుంది.
శ్యామ్ :-
"మేం ఇద్దరం ఇప్పటివరకు ప్రపోజ్ చేసుకోలేదు. కనీసం ప్రేమను తెలియజేసేలా ఏమీ చేయలేదు నేను" అని అన్నాడు.
అప్పుడు పద్దు :- అయితే మీ ప్రేమ ఒక మౌన కావ్యం అన్నమాట ! " అని అంది
అప్పుడు రుక్మిణీ :-
"నేను కూడా అంతే. శ్యామ్ కళ్ళు చూస్తే చాలు, మనసులో మాట చెప్పేస్తా" అని చెప్పింది.
అప్పుడు ప్రేమ్ :-
"అయితే పద్దు గారు వండిన వంటకాల గురించి వాడి మనసులో ఏం అనుకుంటున్నాడో చెప్పు చూద్దాం!" అని అన్నాడు.
అప్పుడు వెనుకనుండి గట్టిగా ఒక్క నవ్వు వినిపించింది. అది ఎవరా అని చూస్తే అక్కడ నరసింహం, మరియు విశ్వనాథ్ గారు చాటుగా వాళ్ల ప్రేమ కథ వినాలి అని అనుకుంటున్నారు.
ప్రేమ్ :-
"అయ్యో పెద్దాయన! ఏంటి మీరు అక్కడ!" అని అడిగాడు.
అప్పుడు విశ్వనాథ్ :-
"మా శ్యామ్ బాబు కథ వినాలి అని! ...అయినా నేను వద్దు అనే చెప్పాను, ఇదిగో ఈ నరసింహమే తీసుకొచ్చాడు" అని నరసింహం గారి మీదకి నెట్టేశాడు.
అప్పుడు నరసింహం :-
"ఇదిగో నా మాట నీ మాటగా, నీ మాట నా మాటగా చెప్తున్నావ్ బావా! బాగోదు చెప్తున్నా!" అని అన్నాడు.
అందరూ వాళ్లని చూసి నవ్వుకున్నారు. అందరూ అలా నవ్వుకోవడం చూసిన శ్యామ్, ఆ ఆనందానికి కారణం రుక్మిణీ అని భావించాడు. రుక్మిణీ అలా నవ్వుతుంటే తన కురులను సరిచేశాడు.
రుక్మిణీ "ఏంటి చూస్తున్నావ్?" అని సైగ చేసి అడిగింది.
శ్యామ్ కి "ఈ ఆనందానికి నువ్వే కారణం" అని చెప్పాలి అని మనసులో ఉన్నా, బయటకి మాత్రం "ఏం లేదు లే" అనేశాడు.
ఆ క్షణం రుక్మిణీ మన శ్యామ్ కి ఎంతో కొత్తగా అనిపించింది. శ్యామ్, రుక్మిణీ వల్ల సంపూర్ణం అయ్యాడు. ఒక మగాడు ఎంత కష్టపడినా, ఎన్ని యుద్ధాలు చేసినా, బయట ప్రపంచానికి ఒక నాయకుడు అయినా... అతను ప్రేమించే అమ్మాయి ముందు కేవలం ఒక ప్రేమికుడు మాత్రమే. పైగా రుక్మిణీని ఒక వరంగా భావించాడు. ఎవరు ఉంటారు అండి ఈ రోజుల్లో రుక్మిణీ లాంటి అమ్మాయి.
భోజనం అయ్యింది. అందరూ బయట వాకిలిలో మంచాలు వేసుకున్నారు. రుక్మిణీ, పద్దులు ఒక మంచం మీద పడుకున్నారు. ప్రేమ్, రఘురాంలు ఒక మంచం మీద. అలాగే విశ్వనాథ్ మరియు నరసింహం ఇంట్లో పడుకున్నారు. శ్యామ్ కి ప్రత్యేకంగా ఒక మంచం ఏర్పాటు చేశారు ఆ ఊరి జనం.
అర్ధరాత్రి శ్యామ్ను ఎందుకో చూడాలి అని అనిపించింది మన రుక్మిణీకి. ఎవరికి తెలియకుండా పైకి లేచి చూస్తే శ్యామ్ మంచం ఖాళీగా ఉంది. ఎక్కడికి వెళ్లాడో అర్థం కాలేదు. అప్పుడే విశ్వనాథ్ గారు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి — సర్పంచ్ గారి మనుషులు శ్యామ్ మీద పగతో ఉన్నారు అని.
ఆ మాటలు గుర్తొచ్చి కంగారుగా లోపలికి వెళ్లింది. మళ్లీ బయటకి వచ్చి చూసింది. వాళ్ల బావగారిని నిద్ర లేపుదాం అనుకుంది. అప్పుడే ఇంట్లో నుండి ఏదో శబ్దం వచ్చింది. రుక్మిణీకి ఒంటరిగా లోపలికి వెళ్లడానికి ధైర్యం చాలలేదు. అయినా సరే భయం భయంగా లోపలికి వెళ్లి చూస్తే అక్కడ...
మన శ్యామ్ ఏదో పుస్తకం రాస్తూ కనిపించాడు. అది కూడా రుక్మిణీ కళ్లద్దాలు పక్కన పెట్టుకుని.
శ్యామ్ను క్షేమంగా చూసిన రుక్మిణీ ఊపిరి తీసుకుంది.
రుక్మిణీ :-
"ఏంటి శ్యామ్ గారు... ఎంత కంగారు పడ్డానో తెలుసా మీ గురించి! అయినా ఈ సమయం లో ఏంటి ఈ రాత?" అని అడిగింది.
అప్పుడు శ్యామ్ రుక్మిణీకి తన కళ్ళజోడు పెట్టి,
శ్యామ్ :-
"నువ్వే చూడు ఏం రాస్తున్నానో! నాకు ఇలా రాత్రిపూటే మంచి మంచి ఆలోచనలు వస్తాయి! అది ఏంటో!" అని అన్నాడు.
ఆ పుస్తకం చూసిన రుక్మిణీ :-
"మీరు ఇలా రాయడం చూస్తుంటే నాకు ఒక ఆలోచన తట్టింది. ఎందుకు అని మనం ఇద్దరం మన ప్రేమ కథని మన కోణంలో రాయకూడదు!!! అంటే నేను నిన్ను ఎలా కలిశానో, నువ్వు నాకు ఎలా తెలుసో, నేను నీ గురించి ఏం అనుకునేదాన్నో... ఇలాంటి విషయాలు కలిపి నేను ఒక డైరీ రాస్తాను. మీరు కూడా మీ కోణం నుండి మన ప్రేమ కథ రాయండి. మన పెళ్లి తర్వాత ఆ రెండు పుస్తకాలు ఇద్దరం చదువుకోవచ్చు!!!!! భలే ఉంది కదా ఈ ఆలోచన?" అని అంది రుక్మిణీ.
ఆ ఆలోచన విన్న శ్యామ్ రుక్మిణీ బుగ్గ గిల్లి,
"మీలానే మీ ఆలోచనలు కూడా ఎంతో అందంగా ఉన్నాయి రుక్మిణీ గారు. తప్పకుండా రాద్దాం!" అని బుజ్జగించాడు.
ఆ ఆనందంలో శ్యామ్ కుర్చీలో ఉండగానే శ్యామ్ను ఆలింగనం చేసుకుంది రుక్మిణీ.
శ్యామ్ రాస్తున్న ప్రతిదీ రుక్మిణీ చదివి, ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే నిష్పక్షపాతంగా చెప్పేది. శ్యామ్ కి ఆ విప్లవ పుస్తకం రాయడంలో మన రుక్మిణీ ఎంతో సహకరించింది.
అంత ప్రేమించే అమ్మాయి ఎవరికి దొరుకుతుంది చెప్పండి... శ్యామ్ జీవితంలో తోడుగా ఉంటూ ప్రతి నిర్ణయంలో పాలుపంచుకుంటుంది!