ప్రసాద్ ఎలా చనిపోయాడో చెప్పమని నాని, వెంకట్ని అడిగాడు. అప్పుడు వాళ్లు ప్రసాద్ భౌతికకాయంతో పాటు ఆ వ్యాన్లో వెళ్తున్నారు. ప్రసాద్ కాలేజీ ఫ్రెండ్స్ అందరూ బైక్ల మీద వ్యాన్ వెనకే వస్తున్నారు. వ్యాన్ స్పీకర్లో భగవద్గీత శ్లోకాలు వినిపిస్తున్నాయి.
"జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ" (పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి మరల జననం తప్పదు) అనే శ్లోకం అంతరార్థం అక్కడ ప్రతిధ్వనిస్తోంది.
నాని మౌనాన్ని ఛేదిస్తూ, “అసలు ఎలా జరిగింది రా ఇది?” అని వెంకట్ని అడిగాడు.
వెంకట్ గద్గద స్వరంతో, “మధ్యాహ్నం కాలేజీ బంక్ కొట్టి, ప్రసాద్ గాడు వాళ్ల క్లాస్మేట్స్తో కలిసి నది ఒడ్డుకు వెళ్లాడు. అందరూ నీళ్లలో దిగి ఆడుకుంటున్న సమయంలో ఒకడు ఈదలేక మునిగిపోతుంటే, వాడిని కాపాడే ప్రయత్నంలో మన ప్రసాద్ గాడు…” అని మాట పూర్తి చేయలేక వెక్కి వెక్కి ఏడ్చేశాడు.
నాని మెల్లగా వెంకట్ కళ్లు తుడిచాడు. శ్రీనివాస్, వెంకట్ ఇద్దరూ నానిని గట్టిగా హత్తుకుని ఏడ్చేశారు.
నాని వాళ్లను ఓదారుస్తూ, “మనలో ఒకడు ఇక లేడనే నిజం జీర్ణించుకోవడానికి మనకు చాలా టైమ్ పడుతుంది రా. నా కన్నా మీరే వాడితో ఎక్కువ సమయం గడిపారు. అందుకే మీకే ఆ బాధ ఎక్కువగా తెలుస్తోంది. వాడు మనతో ఉన్నన్ని రోజులు ఎన్నో మంచి జ్ఞాపకాలను ఇచ్చాడు. ఇప్పుడు శాశ్వతంగా సెలవు తీసుకున్నాడు,” అని బరువెక్కిన గుండెతో అన్నాడు.
భగవద్గీతలో అర్జునుడికి కృష్ణుడు చెప్పిన గీతాసారం లాగానే, నాని మాటలు కూడా వాళ్ళకి ఓదార్పునిచ్చాయి. ఎంతో ఎమోషనల్ పరిస్థితిలో కూడా నాని మనస్తత్వం అతనిలోని 'స్థితప్రజ్ఞత'ను సూచిస్తోంది. కొన్ని క్షణాల పాటు అక్కడ ఎవరూ ఏమీ మాట్లాడుకోలేదు. నాని అప్పుడే చుట్టూ ఉన్న వాళ్లను గమనించడం మొదలుపెట్టాడు. కానీ వాళ్లలో ఆత్మీయుడిని కోల్పోయిన బాధ అంత త్వరగా పోదని నానికి తెలుసు.
దహన సంస్కారాలు ముగిసిన తర్వాత, నాని కాసేపు ఒంటరిగా కూర్చున్నాడు. ఆ తర్వాత వెంకట్, శ్రీనివాస్లకు జాగ్రత్తలు చెప్పి తిరుగు ప్రయాణమయ్యాడు.
దారిలో నానికి వాళ్ల అమ్మమ్మ దగ్గరి నుంచి ఫోన్ వచ్చింది.
“ఏంట్రా నాని బాబూ? ప్రసాద్ చనిపోయాడా? అయినా ఇంతవరకు నువ్వు ఎప్పుడూ ఇలాంటి వాటికి వెళ్లలేదు కదరా? ఇప్పుడు ఎందుకు వెళ్లాలనిపించింది నీకు?” అని ఆరా తీసింది.
నానికి ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాడు.
అప్పుడే ఫోన్లో వెనక నుంచి వాళ్ల తాతయ్య గొంతు వినిపించింది. “సరేలే, ఇంకా జరిగిందేదో జరిగిపోయింది. వాడు తలస్నానం చేశాడో లేదో ముందు కనుక్కో. వాడికి మన సంప్రదాయాలు అస్సలు తెలియవు,” అంటున్నాడు.
అమ్మమ్మ మళ్లీ మాట్లాడుతూ, “అక్కడికి మీ మావయ్య వాళ్ల ఇల్లు దగ్గరే కదరా నాన్న. అక్కడికి వెళ్లి భోజనం చేసి, ఉదయాన్నే ఇంటికి వచ్చేయ్,” అని చెప్పింది.
నాని చిన్నప్పటి నుంచి అమ్మమ్మ దగ్గరే పెరగడం వల్ల ఆమెను “అమ్మా” అని పిలవడం అలవాటు. “సరే అమ్మా,” అన్నాడు.
అప్పుడు అమ్మమ్మ, “అలాగే గబుక్కున వాళ్ల ఇంట్లోకి వెళ్లకు. మీ అత్త నానా మాటలు అంటుంది. ఇంటి బయటే స్నానం చేసి, ఆ తర్వాతే లోపలికి వెళ్లు,” అని హెచ్చరించింది.
“అక్కడికి వెళ్లడం పక్కానా అమ్మా?” అని నాని కాస్త అనాసక్తంగా అడిగాడు.
“ఎక్కువ ఆలోచించకుండా వెళ్లి రా. నేను ఇప్పటికే మీ మావయ్యకు ఫోన్ చేసి చెప్పేశాను. నువ్వు వెళ్లకపోతే మళ్లీ మీ మావయ్య ఏమనుకుంటాడో!” అని కరాఖండిగా చెప్పేసింది.
నానికి అప్పుడు అర్థమైంది—అమ్మమ్మ తనను కావాలనే ఇరికించిందని. “సరే,” అని చెప్పి తప్పనిసరి పరిస్థితుల్లో మేనత్త వాళ్ల ఇంటికి బయలుదేరాడు.